"శ్రీ చొప్ప వీరభద్రప్ప గారి శివదృష్టి అత్యంత సుందరం. వీరి ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ ప్రాశస్త్యం పాఠకులకు అమృతపానం. శివభక్తులకు, జిజ్ఞాసువులకు వీరి రచన భాగవతదృష్టి నను గ్రహిస్తున్నది. ఎందరో మహానుభావులు, తమ అనుభవంతో చెప్పిన ఈశ్వర తత్వాన్ని సంగ్రహించి, 'శివదృష్టి' అనే రచన ద్వారా భగవద్భక్తులకు అర్థమయ్యేట్లు ఈ రచయిత అందించారు.శ్రీ వీరభద్రప్పగారు తమ ""శివదృష్టి"" రచనలోని ""నమఃశివాయ"" మంత్రము వివిదార్ధములు, పంచాక్షరి వివిధనామములు, పంచాక్షరి మహాత్మ్యం, శివలింగైక్యం అనే అంశాలు భక్తులకు అమృతపు గుళికలు. ఈ సందర్భంగా వీరు భక్తుని పరిస్థితిని వివరిస్తూ భక్తుడు తనను తాను మరచి భగవంతునిలో లీనమగుట లయమని వివరించారు. ఇది పరవశస్థితి. ""లయస్థితి భక్తికి పరాకాష్ట"". జీవాత్మ శుద్ధమై, పరిపూర్ణమై ఆత్మసంవేదనము చేసికొనే నిర్వికల్ప సమాధిస్థితి. దీనిని మించిన స్థితి జీవాత్మ పొందలేదు. ఈ స్థితిలో భక్తుడు లేడు. భక్తిలేదు. పూజలేదు. పూజించేవాడులేడు. ఇది అఖండ ఆనంద రూప పరబ్రహ్మైక స్థితి.... వెలుగులో వెలుగు కలసి పోయినట్లుండే పూర్ణ స్థితి ఇది. శరీరంలో శరీరం, జీవంలో జీవం, ప్రాణంలో - ప్రాణం, ఇంద్రియాలలో ఇంద్రియాలు, రూపంలో రూపం, శబ్దంలో శబ్దం లీనమగు స్థితి. పూర్ణ జ్యోతి మింగిన కర్పూర స్థితి. ఇది నిస్సంశయ వాగతీత, భావాతీత, పూర్ణలింగైక్య లయస్థితి. ఇదే ఐక్యస్థితి అని మధురాక్షరాలైన మాటలు ముముక్షువులకందించారు. వీరి అమృత లేఖిని నుండి వెల్వడిన అజరామరాలైన ఆనంద పరబ్రహ్మ సౌందర్యాన్ని పాఠకులైన భక్తులు దర్శించి భాగవత మార్గంలో పయనిస్తూ పునీతులౌతారని ఆశిస్తున్నాను.డా. జి. ఆంజనేయులు, కళ్యాణదుర్గం"